తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి పి. సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు సమర్పించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ (ప్రస్తుతం GHMC పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్)లో జరిగిన భారీ అవినీతి మరియు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.
ఇప్పటికే 10 మంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతించినప్పటికీ, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇంకా లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. చెరువుల FTL ఆక్రమణలు, భవన అనుమతుల్లో అవకతవకలు, పూర్తి చేయని పనులకు బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్లు, ఫైళ్ల మాయం వంటి అంశాలపై ప్రత్యేక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్ చేయడం, ప్రభుత్వ నిధుల రికవరీ చేయడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపి ప్రజా ధనం రక్షించాలని రెండు పేజీల వినతి పత్రంతో కోరారు.