మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఛాంబర్ లో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశం.. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏం చేద్దాం.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుందాం.. అనే అంశం మీద మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఛాంబర్లో మంత్రులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ లపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టులపై చర్చ నిర్వహించారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో ఇటీవల జేఏసీ ఏర్పాటు కావడం, గత ప్రభుత్వంపై విమర్శలు పెరిగి ఆ ప్రభుత్వ ఓటమికి కారణమైన ఈ ప్రాజెక్టుల వ్యవహారం తక్షణమే తేల్చాలన్న ఆలోచన అధికార పార్టీలో రావడంతో ఈ మేరకు చర్చల ద్వారా పాలమూరు ప్రాజెక్టుల దిశగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలు అంశాలపై వారు చర్చించారు. ఈ చర్చను బట్టి పాలమూరు ప్రాజెక్టుకు, అదేవిధంగా నియోజకవర్గంలో రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తుంది..

